తెలుగు సంగతులు

గురువారం, డిసెంబర్ 29, 2011

బద్ధకపు అభివృద్ది-మధ్యతరగతి బుద్ధి.





ఆయనెవరో కోట్ చేసినట్టు “అభివృద్ధికి నిర్వచనం మరింత బద్ధకంతో ఎక్కువ కార్యాల్నీ, సౌకర్యాల్నీ సమకూర్చుకోవడం”.  ఇదేదో వింతగానో వెగటుగానో  అనిపించవచ్చుకొందరికి. కాని తరచి చూస్తే వాస్తవమే  గోచరిస్తుంది.  ఉదాహరణకి టివి రిమోట్, రిమోట్ బొమ్మలు, ఇంట్లోనుంచే అంతర్జాలం (internet) ద్వారా బాంకు లావాదేవీలు, ప్రయాణ ఏర్పాట్లు, షాపింగులు  వగైరాలన్నీ. ఇక్కడ ఒక మేధావి విశ్లేషించిన అభివృద్ది మెట్లను మననం చేసుకోవడం సందర్భోచితం అవుతుంది. గత రెండు శతాబ్దాలలో ప్రపంచ అభివృద్ది ప్రధానంగా మూడు సాంకేతిక దశలుగా అభివృద్ది  చెందింది. అవి మెకానికల్, కెమికల్, ఎలక్ట్రానిక్ రంగాలు. 
 కానీ  ఈ అభివృద్ధి అనబడే ప్రతి మెట్టు నిర్మాణానికి ఎంతమంది పరిశోధకులు, శాస్త్రజ్ఞులు, శ్రామికులు వారి వారి మేధను, శ్రమను  వెచ్చిస్తే – అందరికి ‘బద్ధకంగా పనులు చక్కబెట్టుకొనే అవకాశం చిక్కుతోంది? కాని మనకి వారెవరినీ గుర్తించే తీరిక, విజ్ఞత ఉండడం లేదు. అవసరం అనిపించడం లేదేమో బహుశా! ఎందుకంటే చాలా అభివృద్ది అంశాలకు, వాటి ఫలాలకు ఖరీదు కట్టి చెల్లిస్తున్నామనే లోలోపలి అభిప్రాయం కావచ్చు. కొంతవరకూ వాస్తవమే. కాని ప్రతి పరిశోధకుడు, కర్షకుడు, కార్మికుడు తగిన ప్రతిఫలాన్ని పొందడం లేదన్న వాస్తవాన్ని గుర్తించే స్థితిలో సమాజం లోని సింహభాగం లేకపోవడం కఠిన వాస్తవం.   ఈ ‘సింహ భాగం’ లో ఒకప్పుడు ఉన్నత వర్గాలుగా పిలవబడే అధికాదాయ, భూస్వామ్య వర్గాలు మాత్రమే ఉండేవి. కాని రాను రాను మధ్య తరగతి కూడా చేరడం కాస్తంత చేదు నిజం. ఈ మధ్య తరగతి లో కూడా,కొన్ని రకాల  తొత్తు గాళ్ళు మాత్రమే ఉన్నత వర్గాలకు సై కొడుతూ--- శ్రామిక శక్తిని, మేధస్సును గుర్తించడానికి ఒప్పుకోనివాళ్ళు ఉంటారు. వీళ్ళు సాధారణంగా కొన్ని వర్గాలకు చెంది ఉంటారు.  ఉదాహరణకు --  పలుకుబడి ద్వారానో, కులం మద్దత్తు తోనో ప్రభుత్వోద్యోగాలు పొందిన వారు, మార్కెట్ల మార్పుతో  గాలి వాటు లాభాలు పొందిన వాళ్ళు, నాయకుల వెంబడి తిరిగి లబ్ది పొందే వాళ్ళు, మధ్యవర్తిత్వాలు చేసే బ్రోకరు గాళ్ళు , సారా పాటగాళ్ళు, క్లబ్బులు- లాటరీలోళ్ళు, రౌడీలు – దందా గాళ్ళు, చిన్న మొత్తాలను పెద్ద వడ్డీలకు తిప్పేవాళ్ళు, గల్లీ లీడర్లు, ఓట్లు కొనే వాళ్ళు, కల్తీ గాళ్ళు, లంచాలోళ్ళు, ఆర్.టి.ఏ. – రిజిష్ట్రారు ఆఫీసుల దగ్గరుండే రాతగాళ్ళు(అంటే లోపలి ఆఫీసర్లకి బయటి కలెక్షను గాళ్ళు), మతం పేరుతో- దేవుడి పేరుతో అమాయకులను దోచుకునే వాళ్ళు--- వగైరా ‘కొంచెం శ్రమ తో (లేదా అసలు శ్రమ లేకుండా) ఎక్కువ సొమ్ము’  నొల్లుకునే రకం జనమన్న మాట. అంతేగాని, నిజాయితీగా పని చేసుకొనే అసలు సిసలు జనం కాదు.  ఈ రకంగా మధ్య తరగతి, మద్యం తరగతి తొత్తు గాళ్ళ  మద్దత్తుతో, మధ్యవర్తిత్వంతో  -- దోపిడీ చేసుకునే పాలకవర్గాలు విశృంఖలంగా జాతి సంపదను మెక్కేస్తున్నాయి.  అందుచేత పెద్ద నేరగాళ్ళను దోపిడిగాళ్లను అదుపు చెయ్యాలంటే మనలో, మన మధ్యలో, మన వెంటే ఉన్న దళారి గాళ్లను కనిపెట్టి పని పట్టాలి. పెద్ద దోపిడీదారులు ఎప్పుడూ సామాన్య జనానికి ముఖా ముఖి రారు. మనలోనే ఉండే ఈ మధ్యవర్తి తొత్తు కొడుకుల్నేఅడ్డం పెట్టుకొని మన సంపదను దోచుకుంటారు.
ఈ మధ్యవర్తిగాళ్ళే మొత్తం ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళుగా చలామణి అవుతుంటారు. దేవుడికి ఏం మొర పెట్టుకోవాలన్నా పుజారిగాళ్ళు తప్పనిసరి అని భక్తుల్ని మభ్యపెట్టగలిగే తెలివితేటలు మన దోపిడీదార్లవి.
దీనికి పరిష్కారం ఉందా? ఎందుకుండదు. మన మధ్యలోనే ఉందికదా! ఈ బ్రోకరుగాళ్ళను అదుపు చెయ్యాలంటే, జనం విద్య నేర్వాలి. అది స్కూలు లో నేర్పే విద్య కాదు. మన హక్కుల్ని మనం గుర్తించగలిగే విజ్ఞత. దానిని కాపాడుకునే బాధ్యతా. దానికోసం ఎదురునిలబడే సత్తా. సమాచార హక్కు చట్టం ఆసరాతో చిన్న తీగలాగితే కదిలిన పెద్ద డొంక -- 2జి కుంభకోణంలో ఎంతమంది ఘరానా గాళ్ళు ఊచలు లెక్కబెడుతున్నారు? ఒక్క ప్రజాప్రయోజన వ్యాజ్యం తో ఎంతమంది ప్రముఖులు, ఘనులు ఇప్పుడు చిప్పకూడు తినడం లేదు?   అందుచేత కావాల్సింది కాస్తంత భాద్యత, విజ్ఞత,చొరవ మరి కాస్త తెగువ. చాలామంది బొక్కుడుగాళ్లను బొక్కలో వెయ్యొచ్చు.
ఈ మధ్యవర్తుల ప్రమేయం జనజీవితంలో ఎంత పొందికగా ఒదిగిపోయిందంటే – మనకే స్పృహకు రానంత—దళారి లేకుండా స్కూలు అడ్మిషన్ దగ్గరనుండి, రేషనుకార్డు, జననమరణ సర్టిఫికేట్, ‘అనా’రోగ్యశ్రీ  వైద్యం, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, మునిసిపాలిటీ చెత్త కంప్లయింటు, ఓటరు నమోదు, టాక్సులు, రిజిస్ట్రేషన్లు, ట్రాఫిక్ చలాను--- మహాప్రభో!! ఇందుగలడందు లేడని సందేహం అక్కర్లేదు. ఇదంతా చూస్తుంటే అసలు బ్రోకరుగిరీ దేవుడి దగ్గరే మొదలయ్యిందనిపిస్తుంది.  పంతులు లేకుండా, మంత్రాలు చెప్పకుండా బిడ్డలకు పేరు పెట్టుకోవడం దగ్గరనుండి, తలనీలాలు (నెత్తి మీద బొచ్చు) ఇచ్చుకోవాలన్నా, పెళ్లి, శోభనం( అవును – దానికి మంత్రాలు, పూజలు, ముహూర్తం కూడాను), చావుకి సరే సరి తరతరాలు తద్దినాలు పేరుతొ పంతుళ్ళకు పొత్తర్లు ఇవ్వడమే గాని – మనకు మనం గా పెద్దల్ని తలచుకోలేని దుస్థితి. దేవుడి సంగతైనా, ప్రభుత్వం సంగతైనా మధ్యవర్తుల్ని తప్పించాలి. భక్తులకి, ప్రజలకి అందవలసినవి వరాలు కాదని, మనకు దక్కాల్సిన హక్కులని అర్ధం అవ్వాలి. మనం – మన దేవుడు, మన గోడు, కోరికలు మనం ఇష్టం వచ్చిన రీతిలో ఆయనకు తెలిసే విధంగా (మనకొచ్చిన, నిజాయితీ తో కూడిన భాషలో) చెప్పుకోవాలి. మన దేవుడే అయితే, అడిగేది సబబైనదైతే ఇచ్చి తీరతాడు. దాన్ని మనోబలంతో సాధించుకోవాలి. మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల విషయం మరి ---  వారి కర్తవ్యం వారునెరవేర్చాలి  అంటే – ఆ కర్తవ్యం ఏమిటో, దానికి మనం వారికి అప్పగిస్తున్న బాధ్యత ఎంత, వారు గుంజుకుంటున్న అధికారం ఎంత, వారిపై అవుతున్న వ్యయం ఎంత, అదనంగా కూడ బెడుతున్నసంపద ఎలా వస్తోంది, ఆదాయానికి మించిన ఆస్తులు లెక్కలేస్తే – ప్రపంచంలోని ఏ ఆడిటింగు సంస్థా తేల్చలేనన్నిరకరకాల సంపదలు, వగైరా అన్నీ -- ఎన్నుకున్న మనకు అర్ధం కావాలి – అర్ధం చేసుకోవాలి. అంతవరకూ నిష్కృతి లేదు. మరో ఈజిప్టు గానో, టునీషియా గానో వీధికెక్కాల్సిన అవసరం మన భరతజాతికి రాకూడదంటే, ఇప్పటికయినా మేలుకోవాలి.  
నాలుగు దశాబ్దాలకు పైగా మూలుగుతున్న లోక్ పాల్ బిల్లుకు పార్లమెంటులో దక్కిన గౌరవం కళ్ళారా చూశాం కదా!  అనుకూలించావచ్చు, వ్యతిరేకించావచ్చు, అంతేగాని పలాయనం చిత్తగించడం ఎంతవరకు సబబు? అధికార, విపక్ష అనే బేధం లేకుండా ఇంత ముఖ్యమయిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు ఎగవేసే ప్రతినిధులకు ప్రజలు ఎలా బుద్ది చెప్పాలి? ఐదు సంవత్సరాలు ఆగాలా? ఈ లోపుగానే వారిపై అనర్హత ఓటు వేసే—కనీసం నిలదీసే  అవకాశం ప్రజలకు లేనప్పుడు ఇంకెక్కడి ప్రజాస్వామ్యం?టిక్కెట్టు ఇచ్చిన పార్టీ విప్ జారీ చేసినట్టే ముఖ్యమయిన బిల్లులకు/చట్టాలకు, రాజ్యాంగ సవరణలకు ఓట్లేసిన ప్రజలు విప్ జారీ చేసే విధంగా సంస్కరణలు చేసుకోలేమా? అసాధ్యం అంటారు ఆ గొప్ప గొప్ప ప్రతినిధులు, పెద్దలు, పార్టీలు. కాని మానవుని సామాజిక అవసరాలకొద్దీ ఎన్ని రకాల రాజ్యాంగాలు, చట్టాలు వ్రాయలేదు? ఎంతమంది మేధావులు, బహుళ జన ప్రేమికులు ఎంత శ్రమకోర్చి అవన్ని తయారు చేసుకుంటూ వచ్చారు? కాని ఇప్పుడు అధికారంలో, అనధికార అధికారంలో, సంపద దోపిడిలో ఉన్నవాళ్ళే చట్టాలకు దగ్గర చుట్టలుగా ఉన్నందుకు అవి జరిగే అవకాశం చాలా తక్కువ.  అందుకే ఇప్పటికైనా విప్లవాత్మకమయిన మార్పును ప్రజలు గట్టిగా కోరుకోవాలి. ప్రజలు ఐక్యం కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల ఐక్యతాశక్తిని అందరం ప్రగాడంగా విశ్వసించాలి. 
  

సోమవారం, నవంబర్ 28, 2011

కలాలే కత్తులు


కలాలే కత్తులు



ఇది చలి కాలం. గిలి కాలం. చక్కిలిగిలి కాలం. చక్కని నెచ్చెలి చెక్కిలి తో జిల్ జిల్ కాలం-- సాగినవాడికి.  మరి బడుగు జీవికి-- ఇది చలి కాలమే! కలి కాలం. ఆకలి కాలం. అంబలి కి కూడా కరువైన, అకృత్యాల బలి కాలం. కప్పుకున్న గోనె పాత కూడా బరువయిన వాడికి, మోకాళ్లను మాత్రం ఒడుపుగా డొక్కల్లోకి గుచ్చుకునే సౌకర్యం ఉన్నవాడికి ఇది చలి కాలమే! కాలం మారుతోంది అంటారు- యుగాలు, తరాలు మారుతున్నాయి కాని చలి గిలి కొందరికి—చలి బాధ ఎందరికో—అన్న స్థితి మాత్రం మారడం లేదు. ఆకలికి చచ్చిపోవడం ఊహ కైనా అందుతుందేమో గాని, చలికి చచ్చిపోవడం ఎంత దుర్భరమో ఆ బాధ పడినవాడికి తప్ప తెలియదేమో—సైనేడు రుచి చెప్పలేనట్టు.
ఇటువంటి చలికాలం గురించి సుప్రసిద్ధ జర్నలిస్టు, రచయిత, సాహిత్యవేత్త డా:ఎ.బి.కె.ప్రసాద్ వ్రాసిన వ్యాసం “కలాలు-కరవాలాలు” (సాహిత్యకీయాలు) అనే పుస్తకంలోనిది. ఈ పుస్తకం ఎన్నో విశిష్టమయిన వ్యాసాల సంకలనం. తప్పక చదివవలసిన పుస్తకం. మచ్చుగా ఈ చిన్ని వ్యాసాన్ని ఇక్కడ యధాతధంగా చదవండి.
దుప్పటిలో దూరి మనల్ని అల్లుకుని నిద్దురపోయేది ఎవరు? చెవుల్లో వేళ్ళు జొనిపి మనల్ని అల్లరి పెట్టేది ఎవరు? ఎవరయ్యా మన బుగ్గల్ని చిదిమేసి, పెదాల్ని కొరికేసి నిదురపోనీయనిది ఎవరు? రాత్రివేళ గడప దాటనీయకుండా కాపలా పెట్టేది ఎవరు?
చలికాలం! ఏటా వచ్చే చలికాలం మన సంప్రదాయ జీవితాన్ని పరిపుష్టం చేస్తున్నది. చలికాలమే లేకుంటే ఉన్ని కంబళ్ళు పుట్టుకొచ్చేవి కావు.  చలికాలమే లేకుంటే రేగుపళ్ళు దొరికేవి కావు. చలికాలమే లేనినాడు మనకు నిగనిగ మెరిసే, తళతళ లాడే అంతలేసి ఉసిరికాయలు దర్శనమిచ్చేవి కావు. చలికాలాన్ని తట్టుకోడానికే కదా భోగి మంటలు పుట్టినాయి. ఒక దృశ్యాన్ని మనసుకు తెచ్చుకోండి. నీలాల నేత్రాల్లో కనుపాపలు బెదిరిపోతే అటూ ఇటూ తిరుగుతుంటాయి. రెప్పలకి పూసిన కాటుక చెరిగి, బెదిరి బుగ్గలమీదికి పాకేస్తుంది. తలంటి పోసిన లేత జుత్తు పకపక తుళ్ళిపడినట్టు గాలికి ఎగురుతుంటుంది. పసుపు రాసి నలుగు పెట్టుకున్న బంగారు చేతులతో అమ్మ, నెత్తి మీద దోసిళ్ళతో రేగిపళ్ళు అక్షింతల్లాగ కుమ్మరిస్తుంది. వాటిలోని దమ్మిడీలు కింద కనక వర్షం లాగ కురిస్తే పిల్లలు వాటి కోసం ఒకరినొకరు తోసేసుకొని తగవులాడుకుంటారు. పెద్దలు వాళ్ళని మురిపెంగా మందలిస్తూ తలో దోసెడు రేగుపళ్ళు కాటుక కళ్ళ పాపాయి శిరసుపై దీవెనల్లా కుమ్మరిస్తూ వుంటారు. అది భోగిపళ్ళ వేడుక. అది చలికాలమిచ్చిన కానుక. గ్రామానికి చలి కాపలా కాస్తున్న వేళ వేకువజామున నిదుర లేవడానికి కదా మేలుకొలుపులు మొదలయ్యాయి.
“తెల్లవార వచ్చే తెలియని నా స్వామి
మళ్లి పరుండేవు లేరా!
మళ్లి పరుండేవు, మెసలుతూ వుండేవు
కళ్యాణ గుణధామ లేరా!
నల్లనయ్యా లేర
నను గన్న తండ్రి...”
అనే పాట జ్ఞాపకముందా? తెల్లవారుజామున చలిగాలిలో తేలివచ్చి, కనురెప్పల్ని తట్టి చెవులలో తియ్యని ధ్వనుల్ని ఒలికించే మధురమయిన మేలుకొలుపు పాట చలికాలం నుంచే పుట్టినాయి కదా? ధనుర్మాసం చలికాలం చల్లని వింటినారి మీదే కదా హొయలు పోయేది. అన్ని కాలాల కంటే ఉన్న కాలమే గొప్పది. ఇపుడిక్కడ చలికాలమే నడుస్తున్నది. అయితే ఓ రకంగా ఇది –‘ఉన్న’ వారికి సుఖమైన కాలం. ఉన్ని కోట్ల వారు, దళసరి స్వెట్టర్ల వారు.. ఎందు కట్టెలు వెలిగించి, నెగళ్లు రగిలించి నిగ నిగలాడే గాజుగ్లాసుల్లో తళతళలాడే విదేశీ మద్యం నింపుకొని ఆరారా తాగుతూ మసాలా వంటకపు మాంసాహారం భుజిస్తూ సుఖమయంగా గడపగలిగేవారు రుతువుల రాజుని బతిమాలి తెచ్చుకున్న కాలమిది. ఆకాశాన్ని కప్పుకోలేక, భూమిని చుట్టుకోలేక, చర్మంతో సరిపెట్టుకోలేక , చావు చల్లగా ఉండే పేవ్ మెంట్ల మీదే చనిపోయిన వారి మృతదేహాల మీద పడగ విప్పి ఆడే పాము ఇది. పేదల పాలిట బాముల కాలమిది.
“.... నడివీధిని పడి బతికే
నీ వంటిని గుడ్డ లేదు
వల్లకాటి చితులన్నీ
ఆరి, పచ్చిబారినాయి
రైలు దారి మదుం లోన     
పల్లక తొంగో కొడుకా
మీద వేళ్ళు రైలు మంట
అదే నీకు చలి మంట”
అని ఆరుద్ర ఒక చోట రాశాడు. ఇది పేదల బాధ. తెలుగు కవులు పేదల పక్షానికి ఫిరాయించక ముందు ప్రబంధ యుగంలో రుతువర్ణన మాత్రం తప్పనిసరిగా చేసేవారు.అందుకు వారు కలిగిన వారి చలికాలపు సరదాల గురించి రాసేవారు. కస్తూరి పూసిన జవరాండ్ర జవనాలు వయసువారి చలిని తీర్చే అందమైన కుంపట్లని అర్ధం వచ్చే పద్యాలు పాతకాలపు కవులు ముచ్చటపడి రాసేవారు.వాళ్ళు తరచుగా ముసలివాళ్ళు, పళ్ళుఊడినవారూ ఉండేవారు. అయితే వారా పద్యాలు రాజుల్ని, జమిందారుల్ని,వారి దగ్గర డబ్బులు కొట్టేసి మారు వేషాల్లోని రాజుల వలె  బతికే రసిక మంత్రిమండలిని, ఆ మూడు వర్గాల వారి ఉంపుడుగత్తెల్ని మెప్పించడానికి రాసేవారు.అయితే ఆయా వర్గాల్లోని రాజులకూ, జమీందారులకు, వారి ఉంపుడుగత్తెలకూ చదవడం పూర్తిగా వచ్చేది కాదు. కాబట్టి వారూ ఆ కావ్యాల్ని చాలా గౌరవంగా చూసేవారు. చదవడం వచ్చినవారి సంఖ్య పెరిగేసరికి చాలావరకు అలాంటి ప్రభందాలు నశించిపోయాయి. ఆ కవులూ అంతరించిపోయారు. ప్రబంధాల సంఖ్య  తగ్గడంతోనే సాహిత్యంలో అబద్దాల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో తగ్గింది. రుతువులన్నీ రాజుల, వారి కుటుంబాల, వారి మంత్రి, సామంత, దండనాయకుల సుఖం కోసమే ఒక చక్రగతిన తిరుగుతున్నాయనే భ్రమను కల్పించి కవులూ పబ్బం గడుపుకున్నారు. అయితే గురజాడ మహాకవి తో మొదలై, శ్రీశ్రీ నాడు ప్రభంజనంలాగ పెరిగి, సుబ్బారావు పాణిగ్రాహి నాడు ప్రజల చేతి ఆయుధంగా మారిన తెలుగు కవిత్వం అబద్ధాలకు దూరమై వాస్తవానికీ, ప్రజలకూ దగ్గరైంది. రుతువుల రాకపోకల ప్రభావం ప్రజలపై ఉంటుందన్న అవగాహన మాత్రమే నేడు అందరికీ ఉంది.
వానలు కురియక తెలుగు రైతులు గడ్డిపోచల్లాగ ఎందిపోయారు. గుండె చెరువైన వారి కంటినుండి రాలిన నీరే పొలాలకు నీరై అక్కడక్కడా అరకొర పంటలు పండాయి. సరిగ్గా అప్పుడు సముద్రంలో పుట్టిన విషం తుఫానై నాలుకలు చాస్తూ ఆ పంటపొలాల ప్రాణహరితాన్ని పీల్చివేసింది. చేతికి అందిన సస్య లక్ష్మిని ఎత్తుకుపోయింది. పల్లెలను ఆకలితో, దుఖంతో, గుండె మంటలతో అల్లాడిపోతున్నప్పుడు చలిగాలులు గుర్రాలు పూన్చిన రధం మీద ఎక్కి సంక్రాంతి లక్ష్మి వస్తున్నది. ఎవ్వరూ ఆమెకు స్వాగతం చెప్పకండి. భయకంపిత హస్తాలతో నమస్కరించడం సాధ్యం కాదని చెప్పండి. కొనప్రాణాలతో ఉన్న ఈ పల్లెటూళ్ళతో నీకేం పని తల్లీ, పోయి ప్రపంచ బాంకు రమ్య హర్మ్యాల్లో, భవ్య భవంతుల్లో పూజలు అందుకో అమ్మా అని చెప్పండి. ధాన్యపు కంకుల నుంచి వేళ్ళాడే సిరిమువ్వల సవ్వడులు నీకిక్కడ వినిపించవు. పోయీ ప్రైవేటు పరిశ్రమల యంత్రాలనుంచి వెలువడే శ్రావ్య సంగీతాన్ని ఆస్వాదించమని చెప్పండి!! “   
ఎ.బి.కె.ప్రసాద్ గారి ఈ వ్యాస సంకలనం లో ఎంతో సాహితి చర్చ ఉంది. వాస్తవాలు గణాంకాలు ఉన్నాయి. మేలుకొలుపు ఉంది. చలిని తగ్గించే వేడి, వాడి ఉన్నాయి.
ఎమెస్కో వారి ప్రచురణ. వెల:రూ:100/-
  

శనివారం, అక్టోబర్ 15, 2011

పొగ బండి కధలు



ఓలేటి శ్రీనివాస భాను పేరు కనపడగానే పొగబండి కధలు పుస్తకం కొనేశాను. ఆయన పేరు అంతగా నాకు గుర్తుండేలా హత్తుకున్న విషయాలు రెండు  ఇక్కడ తప్పక ప్రస్తావించాలి. ఒకటి అందర్ని మెప్పించిన దూరదర్శన్ డైరెక్టరు శ్రీ ఓలేటి పార్వతీశం గారు(ఆయనకి, శ్రీనివాస భాను గారికి ఏమయినా బాంధవ్యం గాని, సంబంధం గాని ఉందో లేదో నాకు తెలియదు). ఇక రెండవ విషయం, దశాబ్దం కంటే ముందు మాట. తనికెళ్ళభరణి గారిపరికిణిపుస్తకం గురించి వీరు వ్రాసిన సమీక్ష.(లింకు ఇక్కడ  - http://gksraja.blogspot.com/2011_03_01_archive.html)
పరికిణి’  పుస్తకానికి తగ్గట్టుగా అనేకంటే మించిన విధంగా నన్ను ఆకట్టుకుంది.    పుస్తకం కోసం నన్ను గంగవెర్రులెత్తించింది. పుస్తకాల షాపులకు పరుగులు పెట్టించింది. అందుకే ఆపేరు చూడగానే పుస్తకం కొనేశాను. అనేకమంది స్నేహితులకు కూడా కొని ఇచ్చేలా చేసింది పరికిణి’ పుస్తకం.
ఇక పొగబండిసంగతి. ఆశించినంత, ఆతృత పడినంత స్థాయి తృప్తినివ్వలేకపోయినా, మంచి కధలే చదివాననే హాయి కలిగింది.  కొంచెం ఎక్కువ ఉహించుకోవడం నా తప్పేగాని, భాను గారి కధలది కాదు. సింహభాగం కధలు ఆకట్టుకున్నాయి. మంచి ఇతివృత్తాల్నే ఎంచుకున్నారు. పేరుకు తగ్గట్టుగానే పొగ చిమ్మాయి. కానీ ఆ ‘పొగ’లో కధలు కాస్తంత ‘పొగ’చూరాయి. రైల్వే వ్యవస్థ వెనుక సమాచారం సామాన్య ప్రయాణికుడికే కాకుండా, మాన్య ప్రయాణికుడికి కూడా తెలిసే అవసరం, అవకాశం లేదు. ఈ కధల పుణ్యమా అని ఆ అవసరం వచ్చింది. అతిగా ఉన్న రైల్వే సమాచారం అక్కడక్కడా కధకు కూడా కొంత గ్రహణం పట్టించినా, కధనం లోని విశిష్టత వల్ల అప్పటికప్పుడే వీడి పోయింది కూడా.
“పాదాల్ని తాకడంలో పశ్చాతాపం... కృతజ్ఞత పోటి పడ్డాయి” “సారా కంపునీ, సరసాల్నీ భరిస్తూ ముగ్గురు పిల్లల్నీ, రెండు అబార్షన్లనీ”  "పిండాల్ని అద్దుకున్న నల్ల నువ్వుల్లాగ జ్ఞాపకాలు”  "అంబలి ఖర్చు కన్నా ఆవకాయ ఖర్చెక్కువ”  “జారుతున్న జడల్లాగా రెండు వైపులా రైలు పట్టాలు”  “వయసుతో వచ్చిన అందం తో బాటు, వయసు రాక ముందు నుంచీ ఉన్న అందం వల్ల”  “ఆగే ముందు ఊగే బొంగరం లాంటి నడుము” లాంటి వాక్య నిర్మాణాలు నిండుగా, మెండుగా ఉన్నాయి. మొత్తం మీద ‘పొగబండి కధలు’ బొగ్గుతోనే అయినా, ఎలెక్ట్రిక్ వేగంతోనూ, గూడ్సు బండిలా సుతిమెత్తగానూ, కొంచెం బరువుగానూ సాగిపోయింది. ఓలేటి గారికి డబుల్ అభినందనలు.
‘పొగబండి కధలు’  పబ్లిషర్: క్రియేటివ్ లింక్స్. ధర: రూ:60/-